ఈ పోలీస్ స్టేషన్ మొత్తం పై ఎఫ్ఐఆర్ నమోదైంది ఎందుకో తెలుసా..?
ఆగ్రా: ఆగ్రాలోని సికందరా పోలీస్ స్టేషన్ మొత్తం పై కేసు నమోదైంది. ఈ పోలీస్ స్టేషన్లో పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే తన కొడుకును కొట్టి చంపారని చెబుతూ ఈ పోలీస్ స్టేషన్ మొత్తంపై ఆ తల్లి ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు.
దొంగతనం నెపంపై రాజు గుప్తాను అరెస్టు చేసిన పోలీసులు
ఇక వివరాల్లోకి వెళితే... హేమంత్ కుమార్ అలియాస్ రాజు గుప్తా అనే 32 ఏళ్ల వ్యక్తి దొంగతనం చేశాడనే ఆరోపణలపై పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన ఇంటినుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తన పొరిగింటిలో నివాసం ఉండే అన్షుల్ అనే మహిళ రాజు రూ. 7లక్షలు విలువ చేసే నగలు చోరీ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తన కొడుకు రాజు మానసికంగా బలహీనంగా ఉన్నాడని తల్లి రీను లతా తెలిపింది. పోలీస్ స్టేషన్లో తన కొడుకును తన కళ్లముందే చితకబాదారని తల్లి రీను చెప్పింది. తన కొడుకు అమాయకుడని అతనికి ఏమీ తెలియదని వదలాల్సిందిగా ప్రాధేపడినప్పటకీ పోలీసులు కనికరించలేదని వెల్లడించింది.
సాయంత్రం వరకు చితకబాది... రాత్రి చనిపోయాడంటూ ఫోన్
ఇక గురువారం ఉదయం తనను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని రీను తెలిపింది. మళ్లీ రాజును చితకబాదారని ఆ తల్లి చెప్పింది. సాయంత్రం ఆరుగంటలకు తనను పోలీసులు తిరిగి ఇంటిదగ్గర వదిలి వెళ్లారని చెప్పిన రీను... రాత్రి 9 గంటల సమయంలో తన కొడుకు మృతి చెందినట్లుగా పోలీసులు ఫోన్ చేసి చెప్పారని వెల్లడించింది. శుక్రవారం రోజున రాజు మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయగా... రాజు గుండెపోటుతో మృతిచెందాడని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. ఆయన శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉంది.
ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశాం
జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ ఎస్పీ అమిత్ పాథక్ తెలిపారు. ఇన్స్పెక్టర్ రిషిపాల్, సబ్ఇన్స్పెక్టర్ అనూజ్ సిరోహి, తేజ్ వీర్ సింగ్లను సస్పెండ్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని ఎస్పీ అమిత్ తెలిపారు. అంతేకాదు రాజు పొరిగింటి వారైన అన్షుల్ ప్రతాప్ సింగ్, వివేక్లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రాథమిక విచారణ ప్రకారం పోలీసులకు రాజును అప్పగించకముందే అన్షుల్, వివేక్లు రాజుపై లాఠీలతో కొట్టినట్లు తేలిందని ఎస్పీ చెప్పారు.