టైగర్, ఉక్కు మనిషి: మోడీపై సిక్కు ప్రతినిధుల ప్రశంసలు, వినతి
హూస్టన్: హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న పలువురు సిక్కు ప్రతినిధులు కలిశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేయడాన్ని గుర్తుచేస్తూ ప్రధాని మోడీని అభినందించారు. అలాగే కర్తార్పూర్ కారిడార్ ఏర్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు.
'మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే'
సిక్కువర్గంవారు మోడీని కలుసుకుని ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు పేరును మార్పుచేసి, గురునానక్దేవ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నూతన నామకరణం చేయాలని కోరారు.
అంతేగాక, 1984 సిక్కుల ఊచకోత, భారతీయ రాజ్యాంగంలోని సెక్షన్ 25, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్, వీసా, పాస్పోర్ట్ తదితర అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పులి లాంటి వారంటూ ఓ ప్రతినిధి కొనియాడారు.
దేశానికి మేలు చేసే చర్యలు తీసుకుంటున్న మోడీకి మద్దతుగా ఉంటామని అన్నారు. మోడీ ఓ ఉక్కు మనిషి అని కొనియాడారు. అంతకుముందు కాశ్మీరీ పండిట్లు కూడా ప్రధాని మోడీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని కాశ్మీరి పండిట్లు ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. కాశ్మీరీ పండిట్ల తరపున ప్రధానికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు.