రైతుల కష్టాలు చూడలేనంటూ మత గురువు రామ్సింగ్ ఆత్మహత్య -నిరసన చేస్తున్నచోటే కాల్చుకొని..
సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరనసలు 21రోజుకూడా కొనసాగాయి. బుధవారం అక్కడో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సోనిపట్లో రైతుల ఆందోళనల్లో పాల్గొంటోన్న సిక్కు మత గురువు బాబా రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు.
హర్యానాలోని ఓ గురుద్వారాలో మత ప్రబోధకుడిగా ఉన్న ఆయన.. బుధవారం గన్ తో కాల్చుకుని చనిపోయారు. 65 సంవత్సరాల బాబా రామ్ సింగ్ తన ఆత్మహత్యకు కారణాలు సూసైడ్ నోట్లో రాసినట్టు పోలీసులు తెలిపారు. కుండ్లీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సింఘు బోర్డర్కు ఇది సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైతుల ఉద్యమానికి ఈ సింఘు బోర్డర్ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ఇంకా ఫలితం రాకపోవడంతో మనస్తాపానికి గురైన రామ్ సింగ్.. సూసైడ్ లెటర్లో కేంద్రం తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.
''కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, బాధను తెలియజేసేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. రైతుల్లో బాధను చూస్తున్నా. వారి హక్కుల కోసం రైతులు పోరాడుతున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదు. వారి బాధను నేను పంచుకుంటున్నా. అన్యాయం చేయడం పాపం. అన్యాయాన్ని ఉపేక్షించడం కూడా పాపం. రైతులకు మద్దతు పలికేందుకు కొందరు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. నేను నన్ను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా''అని ఆ సూసైడ్ లేఖలో బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు.
Recommended Video
బాబా రామ్ సింగ్ గన్తో కాల్చుకున్న విషయం తెలిసిన వెంటనే ఆయన్ను పానిపట్లోని పార్క్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని కర్నాల్కు తరలించారు. బాబా మరణంతో రైతుల ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందోననే ఆందోళన నెలకొంది.