డెత్ సిటీగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా..సగటున రోజూ 10కి పైనే
బెంగళూరు: బెంగళూరుకు ఉద్యాననగరిగా పేరుంది. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో మరే రాజధానిలోనూ లేని విధంగా బెంగళూరు నగరం పచ్చదనాన్ని సంతరించుకోవడమే దీనికి కారణం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సిటీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రస్థానానికి ఎగబాకింది. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. క్రమంగా-డెత్ సిటీగా మారుతోంది. దీనికి కారణం.. వాయు కాలుష్యం.
వాయు కాలుష్యం వల్ల బెంగళూరులో సగటున రోజూ 10 మందికి పైగా మరణిస్తున్నారు. కర్ణాటక రవాణాశాఖ లెక్కల ప్రకారం.. సంవత్సరానికి 4000 మంది వాయు కాలుష్యం వల్లే మరణించారని స్పష్టమౌతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానానికి నిలవడం, దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడటం వల్ల క్రమంగా పచ్చదనం మటుమాయం అవుతోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్యలో కూడా భారీగా పెరుగుదల నమోదైంది. బెంగళూరులో సగటున ప్రతి ఒక్కరికీ ఒక వాహనం ఉంది. నగర జనాభా కోటి వరకు ఉంటే.. కోటి వాహనాలు తిరుగుతున్నట్లు రవాణాశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీని ప్రభావం ప్రజలపై పడుతోంది.
ప్రభుత్వ వాదన ఏంటి?
వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి. ఢిల్లీతో పోటీ పడుతోంది. రోజూ 10 మందికి పైగా మరణిస్తున్నారని స్వయంగా కర్ణాటక రవాణాశాఖ మంత్రే వెల్లడించారు. వాహనాలను నియంత్రించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాల సంచారాన్ని నిషేధించదలిచామని మంత్రి తమ్మణ్ణ వెల్లడించారు. రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పొరుగు రాష్ట్రాల వాహనాలు లక్షల సంఖ్యలో నగరానికి వస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుందని విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులో 15 సంవత్సరాలకు పైబడిన వాహనాల లెక్కలను తీయాలని ఇదివరకే రవాణాశాఖను ఆదేశించామని అన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు అధిక మొత్తంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని వివరించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఏం చెబుతోంది?
సమీప భవిష్యత్తులో బెంగళూరులో డెత్ సిటీగా మారుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇదివరకే హెచ్చరించింది. దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చుకుంటే బెంగళూరు ఒక్కటే వందశాతం మేర అభివృద్ధిని నమోదు చేసిందని, ఇదే వేగం మరి కొన్నేళ్ల పాటు కొనసాగితే. ఫలితాలు దారుణంగా ఉంటాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ నివేదికను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెన్ రెండేళ్ల కిందటే విడుదల చేసింది. బెంగళూరు ర్యాపిడ్ గ్రోత్ అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తోందని ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
25 సంవత్సరాల కాలంలో బెంగళూరు జనాభా 150 శాతానికి పెరిగిందని, ఇంత భారీ ఎత్తున నగరీకరణ మరెక్కడా చోటు చేసుకోలేదు. జనాభాతో పాటు, వారి రోజువారి అవసరాల కోసం పచ్చదనాన్ని ధ్వంసం చేశారు. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అడ్డూ, అదుపు లేకుండా పెరగడం వల్ల పచ్చదనం కనుమరుగైనట్లు ఐఐఎస్సీ నివేదిక చెబుతోంది. మరో పదేళ్లలో బెంగళూరు నగరం ఏ మాత్రం నివాసయోగ్యం కాని నగరంలా మారుతుందని అంచనా వేసింది.
40 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరుగనంతగా అభివృద్ధి చెందడం వల్ల 78 శాతం పచ్చదనం మాయం కావడం, నగరం, నగర శివార్లలోని చెరువులు, కుంటల స్థానంలో భారీ భవనాలు నిర్మించడం వంటి పరిణామాలు సంభవించాయని ఐఐఎస్సీ తెలియజేసింది. దీనికంతటికీ బెంగళూరు అభివృద్ధి ప్రాధీకార సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇష్టానుసారంగా లే అవుట్లకు అనుమతి ఇవ్వడం కూడా ఈ పరిస్థితికి ఓ కారణమని ఐఐఎస్సీ ప్రొఫెసర్ ఒకరు అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా వాయు కాలుష్యం మితిమీరిపోయిందని, సగటున రోజూ 10 మంది ప్రాణాలను తీస్తోందంటూ రవాణాశాఖ లెక్కలు స్పష్టం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.