జల్లికట్టు కుదరదంటే.. దేశం విడిచి వెళ్లిపోతా, ఇదేం వివక్ష: హీరో శింబు
తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీల నిర్వహణ కుదరదంటే, తాను ఈ దేశాన్ని విడిచిపోతానని తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
: తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీల నిర్వహణ కుదరదంటే, తాను ఈ దేశాన్ని విడిచిపోతానని తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జల్లికట్టు కోసం విడివిడిగా పోరాటం చేస్తే ఫలితం ఉండదన్నారు. అందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జల్లికట్టు కోసం తన ఇంటి ముందు పది నిమిషాలు మౌనం పాటిస్తానని తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో తమిళ ప్రజలు సతమతమవుతూనే ఉన్నారన్నారు. వీటి పరిష్కారం కోస ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు.
కాశ్మీర్లో ఎవరైనా మరణిస్తే భారతీయుడు చనిపోయారంటారని,క అదే కన్యాకుమారిలో చనిపోతే తమిళ జాలరి మృతి చెందాడని చెప్పడం ఏమిటన్నారు. ఈ వివక్ష ఎందుకో చెప్పాలన్నారు. తాము కూడా భారతీయులమే అన్నారు.
కాగా, జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని అన్నాడీఎంకే పార్టీ కోరింది. ఈ మేరకు బుధవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీచేయాలని ఇటీవల తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ప్రధాని మోడీని కోరిన తర్వాత శశికళ లేఖ రాయడం గమనార్హం.
జల్లికట్టు-వీరోచిత క్రీడ: ఇలా మలుపులు తిరిగింది!
జల్లికట్టు ఆట కోసం తమిళనాడులో వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పన్నీరు సెల్వం స్పందించారు. రాష్ట్రంలో జల్లికట్టు జరుగుతుందని పన్నీరు సెల్వం పునరుద్ఘాటించారు.
జల్లికట్టుపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే ఆరోపించింది. కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే జల్లికట్టు నిర్వహణను సుప్రీం కోర్టే తేలుస్తుందని మంగళవారం అన్నారు. దీనిని డిఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి స్టాలిన్ తప్పుబట్టారు.