సిమీ టెర్రరిస్టుల ఎస్కేప్ ప్లాన్ : టూత్ బ్రష్, చెక్కతో 'కీ' తయారుచేసుకున్నారు
భోపాల్: హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ ను హతమార్చి.. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పరారవడానికి ప్రయత్నించిన 8మంది సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జైలు నుంచి పారిపోవడానికి ఉగ్రవాదులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
తమకు అందుబాటులో ఉన్న టూత్ బ్రష్, ఓ చెక్కతోనే తమ ప్లాన్ మొత్తాన్ని అమలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటి సహాయంతోనే ఉగ్రవాదులు మరో మారు తాళం చెవిని రూపొందించుకున్నారు. అదే తాళంతో బ్యారక్ గది తాళాలు తీసినట్టుగా అధికారులు గుర్తించారు. బ్యారక్ తాళాలు తీసి తప్పించుకునే క్రమంలోనే రమాశంకర్ ను హత్య చేశారు.
ఇక అక్కడినుంచి భోపాల్ శివారు ప్రాంతమైన కేజ్రా నుల్లా ప్రాంతానికి ఉగ్రవాదులు చేరుకున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని రౌండప్ చేశారు. అయితే ఉగ్రవాదులు తమవద్దనున్న మారణాయుధాలతో దాడులకు యత్నించడంతో.. వరుసగా 43రౌండ్ల పాటు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ మొత్తం ఘటనలో 8మంది ఉగ్రవాదులు హతమవగా.. ముగ్గురు పోలీసులు గాయాలపాలయ్యారు.