డిసెంబర్లో లోకసభ ఎన్నికల్లేవు, అదే ప్రధాన సమస్య: కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: లోకసభకు గడువు ప్రకారం 2019 మే నెలలో జరిగే ఎన్నికలను జమిలిగా నిర్వహించాలని కేంద్రం భావిస్తే అందుకు ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధమని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించిన తర్వాతే ఏమైనా చేయగలమని తెలిపింది.
ఈ మేరకు ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ శనివారం ఓ ఛానల్తో మాట్లాడారు. చట్ట సవరణ ఒకే అయితే ఈవీఎంలు, ఇతర సాధనా సంపత్తిని, సాయుధ బలగాలను సమకూర్చుకోవడం పెద్ద సమస్య కాదని తెలిపారు.
4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఏడాది డిసెంబరులో లోకసభకూ ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. లోకసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదన్నారు. భవిష్యత్తులో అన్ని ఎన్నికలకూ ఓటు రసీదు యంత్రాల (వీవీపాట్ల)నే వాడనున్నామనీ, వీటి పని తీరుపై మొదటి స్థాయి తనిఖీలు పూర్తి అయ్యేందుకు సమయం సరిపోదనీ తెలిపారు.
సెప్టెంబరు చివరి నాటికి తాము కోరినన్ని వీవీపాట్లు సరఫరా చేయాల్సి ఉందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పనికాదన్నారు. 2019లో గడువు ప్రకారం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, లోకసభ ఎన్నికలను ఒకేసారి మే నెలలో నిర్వహించేందుకు సిద్ధమన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వీటిని ఉపయోగించనున్నట్లు చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి తగిన సవరణలు చేస్తే, ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.