అగ్గిపెట్టె జేబులోనే ఉంటుంది: అశోక్ గజపతిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోక్గజపతిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు అగ్గిపెట్టె తన దగ్గర ఉంటుందని, తననెవరూ చెక్ చేయరని అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు.
అగ్గిపెట్టె తీసుకెళ్లడం తప్పేమీ కాదని అంటూనే అగ్గిపెట్టెతో విమానాన్ని హైజాక్ చేయలేమని ఆయన పేర్కొన్నారు. తాను పౌర విమాన యానాల మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను తనిఖీ చేయడం ఆపేశారని ఆయన చెప్పారు.
మంత్రిని కాబట్టి సిబ్బంది తన దేహాన్ని తడిమి చూడబోరని, దీంతో లైటర్స్నూ అగ్గిపెట్టేలను కాపాడుకోగలనని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అగ్గిపెట్టే ప్రమాదానికి కారణమైన సంఘటనలు ఇప్పటి వరకూ లేవని ఆయన అన్నారు. తాను విపరీతంగా పొగ తాగుతానని, దాంతో తాను అగ్గిపెట్టెలను దగ్గర ఉంచుకుంటానని, ఇంతకు ముందైతే వాటిని తీసేసుకునేవారని, ఇప్పుడు మంత్రిని కాబట్టి తనకు ఆ సమస్య లేకుండా పోయిందని ఆయన అన్నారు. అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన చర్చ సాగుతోంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఆశోక్ గజపతిరాజు దాదాపుగా వివాదరహితుడైన నాయకుడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరడంతో తొలిసారే అశోక్ గజపతిరాజుకు మంత్రి పదవి దక్కింది.