ఇంజిన్లో పొగ: విమానం అత్యవసర ల్యాండింగ్
చెన్నై: సింగపూర్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల 170 ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
170 మంది ప్రయాణికులతో స్కూట్ ఎయిర్లైన్స్ విమానం నంబర్ ఎస్సీఓ 567 తమిళనాడులోని తిరుచ్చి నుంచి సింగపూర్కు బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానం ఇంజిన్లో అవాంఛనీయ శబ్దాలు వినిపించాయి. కొద్దిసేపటికే పొగ వెలువడింది. ప్రమాదాన్ని శంకించిన పైలెట్ వెంటనే సమీపంలోని చెన్నై విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించారు.
ఏటీసీ అనుమతి ఇవ్వడంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇంజిన్ నుంచి పొగ రావడానికి గల కారణాలను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. విమానం సాయంత్రం 5 గంటల సమయంలో సింగపూర్కు బయలుదేరి వెళ్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.