ఒకే దేశం ఒకే ఎన్నిక..! కాదు, కాదు ఒకే పార్టీ ఒకటే ఎన్నిక..! మోదీ-షాల అంతిమ లక్ష్యం ఇదేనా..??
ఢిల్లీ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో బీజేపి బలమైన ముద్ర వేసుకునేందుకు వినూత్న అడుగులు వేస్తోంది. అందుకోసం కార్యాచరణ కూడా రూపొందించుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మరోసారి తన రాజకీయ అజెండాకు పదునుపెట్టబోతోంది. వివిధ రకాల అంశాలతో ఈనెల 19 అంటే నేటి బుదవారం ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖయే ఇందుకు పూనుకుంటోంది. అయిదు అంశాల అజెండాలో ఒకే ఒక్క అంశం అత్యంత కీలకమైనది. రాజకీయ ప్రాధాన్యంతో ముడిపడింది. మిగిలిన నాలుగు అంశాలు సాధారణమైన వ్యవహారాలే. జాతీయ స్థాయిలో చర్చ పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినంతటి వివాదాస్పద విషయాలు కాదు. పార్లమెంటు ఔన్నత్యం పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనేది అజెండాలో మొదటి అంశంగా సూచించారు.
మోదీ-షా ల అంరార్థం అదేనా..! ఒకే దేశం ఒకటే పార్టీ పాలన..!!
నిజానికి కేంద్రప్రభుత్వం ఈదిశలో తనంత తాను చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరూ అభ్యంతరం పెట్టరు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో నవభారత నిర్మాణం అనేది మరొక అంశం. అలాగే మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ, చివరిగా వెనకబడిన జిల్లాల అభివృద్ధి. వీటిలోదేనిపైనా పెద్దగా రాజకీయ పార్టీలతో చర్చించాల్సినంతటి తీవ్రత లేదు. కానీ ఒక దేశం, ఒకే ఎన్నిక అన్న అజెండాలోని టాపిక్ మాత్రం రాజకీయ వేడిని రగిలించేదే. 2014 నుంచి ఈ అంశాన్ని కేంద్రం సజీవంగా ఉంచుతూ వస్తోంది. రకరకాల ఆప్షన్లను పార్టీల ముందు పెడుతోంది.
Recommended Video
డీజేపి మాస్టర్ ప్లాన్..! శాశ్వత పాలన దిశగా అడుగులు..!!
ఒక దేశం, ఒకే ఎన్నికలు అన్న నినాదం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిరంతరం దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండటం సాధారణ తంతై పోయింది. దీనికి విరుగుడుగా దేశంలో లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేస్తే గొడవ వదిలిపోతుంది. తర్వాత పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టవచ్చనేది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. అయితే జాతీయ పార్టీలకు ప్రయోజనం అధికంగా ఉంటుందని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలను ఒకే ప్లాట్ ఫారం పైకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రాంతీయత్వం బాగా పెరిగిపోవడం జాతీయ సమగ్రతకే భంగకరమని బీజేపీ భావిస్తోంది.
కమలం పార్టీ కి సంపూర్ణ మెజారిటీ..! సుస్థిర అదికారం వైపు ప్రణాళికలు..!!
గడచిన మూడు దశాబ్దాలుగా ఏ జాతీయ పార్టీకి లేనంత బలం బీజేపీకి ఇప్పుడు లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ మొత్తం భారత దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపేస్తే రాజకీయ స్థిరత్వాన్ని సాధించవచ్చని కమలనాథుల అంచనా. దానివల్ల కశ్మీర్ వంటి వివాదాస్పద అంశాల్లో దృఢమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాల్లోనూ జాతీయ వైఖరికి మద్దతు ఒకేసారి కూడగట్టవచ్చు. ప్రాంతీయ పార్టీల డిమాండ్లు, వాటి లోకల్ అజెండాను పక్కనపెట్టేయవచ్చనేది బీజేపీ యోచన. దేశవ్యాప్త ఎన్నికలు జరిగితే అంత పెద్ద ఎత్తున చర్చకు తావుండదు. జాతీయవాదం, దేశ రక్షణ వంటి అజెండాను భుజానకెత్తుకునే బీజేపీ వంటి పార్టీలకు గరిష్ఠంగా లబ్ధి సమకూరుతుంది.
చట్టసవరణ చేయాలని భావిస్తున్న బీజేపి..! పావులు కదుపుతున్న అదిష్టానం..!!
కానీ ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలంటే ప్రాంతీయ పార్టీలు అంగీకరించకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలవ్యవధిని కుదించాల్సి వస్తుంది. కొన్నిచోట్ల పెంచాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం రాజ్యాంగబద్ధం కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సగం పైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే కేంద్రంలోని బీజేపీకి ప్రస్తుతం ఈరకమైన సవరణ చేసేందుకు అవసరమైన చట్టసభల బలం లభించింది. లేదంటే దేశంలో సగం అసెంబ్లీలకు ఒకసారి మిగిలిన అసెంబ్లీలకు లోక్ సభతో కలిపి నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు.