భారత్పై కరోనా పడగ: ఐసొలేషన్లలో ఏడు లక్షల మందికిపైగా: కొత్త కేసుల ఉప్పెన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకూ మహా భయంకరంగా కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో వేగం మందగించినప్పటికీ మనదేశంలో దాని ప్రభావం ఏ మాత్రం తగ్గట్లేదు. రోజూ 70 వేలకు అటుఇటుగా కరోనా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే.. తాజాగా కరోనా కేసుల నమోదులో వేగం కనిపిస్తోంది. 50-60 వేల మధ్య నమోదవుతూ వచ్చిన రోజువారీ కరోనా కేసులు తాజాగా.. 70 వేలకు చేరువగా వెళ్తున్నాయి. ఫలితంగా- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు మించిపోయింది.
కరోనా కాటుకు బలి అవుతోన్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 56 వేల మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 69,239 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 912 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరుకుంది. ఇప్పటిదాకా 56,706 మంది మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,668కు చేరుకుంది. 22,80,567 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.
రోజు 70 వేల వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం.. దేశంలో నెలకొన్న తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ స్థాయి కేసులు ప్రపంచంలో మరెక్కడా నమోదు కావట్లేదు. అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ఈ స్థాయిలో ఈ పరిస్థితి లేదు. ఇంత వేగం కనిపించట్లేదు. భారత్లో మాత్రం రోజూ 70 వేలకు అటుఇటుగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల్లో రెండోస్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్ను చేరుకోవడానికి భారత్కు ఇక ఎంతో కాలం పట్టకపోవచ్చు.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు మూడు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజులో 8,01,147 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలూ టాప్ ప్లేస్లో ఉన్నాయి. కరోనా కేసుల నమోదులోనూ ఈ అయిదింటితో పాటు మరికొన్ని రాష్ట్రాలు హాట్స్పాట్లుగా మారాయి.