వణుకు పుట్టించేలా: 52 వేలకు పైగా: ఫస్ట్ టైమ్: ఆ హాట్స్పాట్లో తీవ్రత తగ్గుముఖం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత తీవ్రతరమైంది. కొద్దిరోజులుగా 50 వేలకు అటు ఇటుగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఈ సారి దాన్ని అధిగమించింది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,123 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో అరలక్షకు మించిన కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. 775 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు.
తనను తాను మహ్మద్ ప్రవక్తగా: అమెరికా పౌరుడిపై పాక్ కోర్టులో బుల్లెట్ల వర్షం: దైవదూషణగా
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలకు చేరువైంది. ఇప్పటిదాకా 15,83,792 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 34,968 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 10 లక్షలను దాటుకుంది. ఇప్పటిదాకా 10,20,582 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,28,242గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్ను విడుదల చేసింది.
కాాగా- దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి బుధవారం వరకు మొత్తం 1,81,90,382 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 4,46,642 మంది నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. త్వరలోనే ఈ సంఖ్య అయిదు లక్షలకు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నట్లు ఐసీఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ముంబైలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. తాజా బులెటిన్ ప్రకారం.. ముంబైలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1118 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఈ ఒక్క నగరంలోనే ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11,964లకు చేరుకుంది. కొత్తగా 60 మంది మరణించారు. ఇప్పటిదాకా కరోనా మరణాల సంఖ్య 6244కు చేరుకుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బీఎంసీ పరిధిలో అయిదు లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించారు.
Recommended Video
కొద్దిరోజులుగా ముంబై పరిధిలో నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని చెప్పారు. కొత్త కేసుల సంఖ్య ఒకశాతం కంటే దిగువకే నమోదు అయ్యాయని తెలిపారు. బుధవారం నాడు 0.97 శాతంగా కొత్త కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. 72 రోజుల తరువాత కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోందని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగుతుందని అంటున్నారు. ధారావిలో కరోనా అదుపులోకి రావడం వల్లే పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నామని చెబుతున్నారు.