కరోనా కోరల్లో దేశం: ఒక్కరోజే 60 వేల మందికి పైగా: హాట్స్పాట్లుగా ఆ రాష్ట్రాలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరింత బలపడుతోంది. రోజురోజుకూ, గంటగంటకూ చెలరేగిపోతూనే ఉంది. కరోనా వైరస్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ ఫలించట్లేదు. లాక్డౌన్ విధించినా కేసుల సంఖ్యలో దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా లాక్డౌన్ను సడలించాల్సి వచ్చింది. కంటైన్మెంట్ జోన్లకు పరిమితం చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ రోజువారీ కేసులు మరింత పెరుగుదల బాట పట్టాయే తప్ప.. ఎక్కడా తగ్గుముఖం పట్టట్లేదు. ఏపీ సహా ఏడెనిమిది రాష్ట్రాలు కరోనాకు హాట్స్పాట్లుగా మారాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 60,963 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 834 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,29,639కి చేరుకుంది. మరణాల సంఖ్య 46 వేలను దాటుకున్నాయి. 46,091 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,43,948కి చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,39,600గా నమోదైంది.
దేశవ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సారథ్యంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రోజువారీ శాంపిళ్ల టెస్టుల్లో ఐసీఎంఆర్ మరోసారి రికార్డును నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 7,33,449 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన కరోనా నమూనా పరీక్షల సంఖ్య 2,60,15,297కి చేరుకుంది. కరోనా వైరస్ టెస్టింగులను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీలను కేంద్రం ఏర్పాటు చేసింది.
Recommended Video
ఏపీ సహా పలు రాష్ట్రాలు కరోనా వైరస్కు హాట్స్పాట్లుగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకునే విషయంలో సహకరిస్తామనీ హామీ ఇచ్చారు.