కరోనా కేసుల్లో సరికొత్త వెల్లువ: 67 వేలు: 47 వేలు దాటిన మరణాలు: యాక్టివ్ కేసుల్లో ఏపీ స్థానం ఇదీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సరికొత్త వెల్లువను సృష్టిస్తోంది. రోజురోజుకూ మరింత బలపడుతోంది. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.. వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా మరణాల సంఖ్యలో కూడా మార్పు ఉండట్లేదు. రోజూ వందలాది మంది వైరస్ పేషెంట్లు మృత్యువాత పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి తీసుకుంటోన్న చర్యలు ఫలించట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి చోట్ల కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణ హాట్స్పాట్స్: జీహెచ్ఎంసీలో కరోనా కల్లోలం: 43 వేలకు పైగా: జిల్లాల్లో అదే తీరు
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 66,999 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 942 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,96,638కి చేరుకుంది. మరణాల సంఖ్య 47 వేలను దాటుకున్నాయి. ఇప్పటిదాకా 47,033 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,53,622కు చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,95,982గా నమోదైంది.
దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సారథ్యంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రోజువారీ శాంపిళ్ల టెస్టుల్లో ఐసీఎంఆర్ మరోసారి రికార్డును నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో శాంపిళ్లను పరీక్షించడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా నిర్వహించిన కరోనా నమూనా పరీక్షల సంఖ్య 2,68,45,688కి చేరుకుంది. కరోనా వైరస్ టెస్టింగులను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీలను కేంద్రం ఏర్పాటు చేసింది.
Recommended Video
దేశవ్యాప్తంగా యాక్టివ్గా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఏపీ రెండోస్థానానికి చేరుకుంది. ఏపీలో మొత్తం 90,425 మంది కరోనా వైరస్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. తొలిస్థానంలో మహారాష్ట్ర కొనసాగుతోంది. ఇక్కడ 1,48,313 కరోనా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 5,48,313 కేసులు నమోదు అయ్యాయి. ఆ ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. బుధవారం నాటి బులెటిన్ ప్రకారం మహారాష్ట్రంలో 12,712 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. 344 మంది మరణించారు. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 18,650కి పెరిగింది.