భవిష్యత్తులో జీఎస్టీ భారీ ఊరట, 28 స్లాబ్ తొలగిస్తాం, పన్ను ఎగవేత తగ్గింది: జైట్లీ
న్యూఢిల్లీ: భవిష్యత్తులో జీఎస్టీ 18 స్లాబ్ వరకే ఉంటుందని, 28 శాతం స్లాబ్ను తీసివేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన బ్లాగ్లో 'పద్దెనిమిది నెలల జీఎస్టీ' పేరుతో రాశారు. దీనిని తన ఫేస్బుక్ అకౌంటులో పోస్ట్ చేశారు. 99 శాతం వస్తువులు 18 శాతం, అంతకంటే తక్కువ స్లాబులోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.
జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబ్ 28 శాతాన్ని క్రమంగా తొలగిస్తామని పేర్కొన్నారు. 12, 18శాతం శ్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ స్లాబులు తగ్గుతాయని దీని ద్వారా సంకేతాలు ఇచ్చి, ప్రజలకు మరింత ఊరట కలిగించారు.
జీఎస్టీ కంటే ముందు ఇలా, తర్వాత ఇలా
జీఎస్టీకి ముందు చాలా వస్తువులపై 31 శాతం అంతకన్నా ఎక్కువ పన్నులు ఉండేవని, దీంతో పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేదని, సరకు రవాణా కూడా ఆలస్యమయ్యేదని, 2017 జులై 1న జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 31 శాతం అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28 శాతం స్లాబ్లోకి చేర్చామని జైట్లీ పేర్కొన్నారు. క్రమంగా అందులోని చాలా వస్తువులపై కింది స్లాబ్లోకి మార్చామని, సామాన్యులు ఉపయోగించే నిత్యావసర వస్తువులను సున్నా, 5 శాతం పన్ను స్లాబ్లోకి తెచ్చామన్నారు.
సినిమా టిక్కెట్ల ధరలు భారీగా తగ్గాయి
అంతకుముందు 35 నుంచి 110శాతం ఉన్న సినిమా టికెట్లను 12 నుంచి 18 స్లాబ్లోకి మార్చామని జైట్లీ తెలిపారు. దీని వల్ల పన్ను ఎగవేత చాలా వరకు తగ్గిందని అన్నారు. ప్రస్తుతం కేవలం విలాసవంతమైన వస్తువులతో పాటు సిమెంట్, డిష్ వాషర్లు, ఏసీలు, పెద్ద పెద్ద టీవీల పైన మాత్రమే 28 శాతం స్లాబ్లో ఉన్నాయని తెలిపారు.
నిత్యావసర వస్తువులు ఇలా
నిత్యావసర వస్తువుల్లోని 1,216 వస్తువుల్లో 183 రకాల వస్తువులపై ఎలాంటి పన్ను లేదని, ఐదు శాతం స్లాబ్లో 308, 12 శాతం స్లాబ్లో 178, 18 శాతం స్లాబ్లో 517 వస్తువులున్నాయని తెలిపారు. ముందు ముందు సిమెంట్పై ఉన్న పన్నును కూడా తగ్గిస్తామని, 28శాతం స్లాబ్ క్రమంగా తొలగిపోతుందని తెలిపారు.
జీఎస్టీ మరింత సరళీకృతం
రానున్న కాలంలో జీఎస్టీని మరింత సరళీకృతం చేస్తామని జైట్లీ తెలిపారు. 12 శాతం, 18 శాతం స్లాబ్లు కాకుండా వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ రేటు 12, 18 శాతాలకు మధ్యస్తంగా ఉంటుందని, కానీ దీనికి కొంత సమయం పట్టే అవకాశముందని, పన్ను చెల్లింపులు పెరిగిన దాని ప్రకారంగా ఈ పన్ను రేటును తీసుకు వస్తామని, ఇకపై జీఎస్టీలో సున్నా, 5 శాతం, ప్రామాణిక పన్ను రేటు మాత్రమే ఉంటాయని తెలిపారు.