గాలిలో విమానం, చుక్కలు చూపించిన ఎలుక
న్యూఢిల్లీ: గాలిలో హాయిగా వెలుతున్న విమానంలో ఒక ఎలుక సందడి చేసింది. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది హడలిపోయారు. అసలు విషయం తెలియకపోవడంతో కొందరు విమాన ప్రయాణికులు ఎలుక చేస్తున్న చేష్టలకు నవ్వుకున్నారు.
తీరా విమానం వెనక్కి తిరిగి రావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం న్యూఢిల్లీ నుండి ఏయిర్ ఇండియా విమానం ఏఐ-123 యూరప్ లోని మిలాన్ నగరానికి బయలుదేరింది. విమానం బయలుదేరిన కొన్ని గంటల తరువాత క్యాబిన్ లో ఎలుక దర్శనం ఇచ్చింది.
విమాన సిబ్బంది, ప్రయాణికులు ఎలుకను గుర్తించారు. ఎలుక గురించి తెలుసుకున్న పైలెట్ లు విమానం కిందకు దింపడానికి ప్రయత్నించారు. అయితే విమానం అప్పటికే పాకిస్థాన్ మీదుగా వెళుతోంది. పైలెట్ లు న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు.
న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు విమానం వెనక్కి తీసుకురావడానికి అనుమతి ఇచ్చారు. గాలిలో ఉన్న విమానంలోని వైర్లను ఎలుక కొరికితే గాలిలోనే ప్రాణాలు పోతాయని విమాన సిబ్బంది హడలిపోయారు. విమానంలో మొత్తం 200 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానం క్షేమంగా తిరిగి వచ్చి న్యూఢిల్లీలో ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పార్శిల్ వాహనాల నుండి ఎలుక విమానంలోని క్యాబిన్ లోకి వెళ్లి ఉంటుందని ఎయిర్ పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.