28ఏళ్ల తర్వాత సిస్టర్ అభయకు న్యాయం: ఫాదర్, నన్లే దోషులు, వారి అశ్లీలం చూసిందనే..
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీ హత్య చేసినట్లు తేలడంతో వారిని దోషులుగా ప్రకటించింది. డిసెంబర్ 23న దోషులకు శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. అభయ కేసులో 28ఏళ్ల తర్వాత తీర్పు వెలువడటం గమనార్హం. కోర్టు తీర్పు పట్ల మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, అభయ స్నేహితులు హర్హం వ్యక్తం చేశారు.
ఆ అశ్లీలం చూసిందనే..
అభయ హత్య కేసులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీసీఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్కడే హాస్టల్లో ఉండేది. 1992, మార్చి 27 తెల్లవారుజామున అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్లోకి వెళ్లగా.. అక్కడ ఫాదర్ కొట్టూర్, ఫాదర్ పుథ్రకయాల్, నన్ సెఫీ అభ్యంతరకర రీతిలో కనిపించారు. దీంతో తమ విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో.. ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ.. అభయ తలపై కర్రతో బలంగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
ఆ తర్వాత నేరం బయటపడకుండా.. సిస్టర్ అభయ మృతదేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ కేసును తొలుత స్థానిక పోలీసులు, ఆ తర్వాత క్రైం బ్రాంచ్ దర్యాప్తులో కూడా ఆమెది ఆత్మహత్యేనని తేల్చడం గమనార్హం. అయితే, దీనిపై సిస్టర్ అభయ స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మానవ హక్కుల కార్యకర్త జోమన్ పుతిన్ పురక్కల్ తోపాటు పలువురు కోర్టును ఆశ్రయించడంతో 1993లో కేసును సీబీఐకి అప్పగించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన సీబీఐ.. ఫాదర్ కొట్టూర్, నన్ సేఫీ, ఫాదర్ ఫూథ్రకయాల్ను నిందితులుగా తేల్చింది. నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు కూడా నిర్వహించింది.
28ఏళ్ల సుదీర్ఘ విచారణ.. దోషులుగా ఫాదర్, నన్
ఆ తర్వాత 2009లో సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఫాదర్ కొట్టూర్, సెఫీని దోషులుగా తేలుస్తూ మంగళవారం సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పువెలురించింది. ఇక ఫాదర్ ఫూథ్రకాయల్కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో రెండేళ్ల క్రితం అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. కోర్టులో అభయ కేసు విచారణ కొనసాగుతుండగానే ఆమె తల్లిదండ్రులు మరణించారు. కాగా, దోషులకు డిసెంబర్ 23న కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.