షాక్: చెట్టుకు వేలాడుతూ ఆక్కాచెల్లెళ్లు, హత్యానా?
నోయిడా: ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్కా చెల్లెళ్ల శవాలు తమ ఇంటి ముందు ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మంగళవారం ఉదయం తెల్లవారు జామున ఆ దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు బిక్కచచ్చిపోయారు.
అక్కాచెల్లెళ్లలో ఒకరికి 18 ఏళ్లు కాగా మరొకరికి 13 ఏళ్లు ఉన్నాయి. వారి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా హత్య చేసి శవాలను చెట్టుకు వేలాడదీశారా అనే సందేహం కలుగుతోంది.
తెల్లవారు జామున ఇలా...
సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నోయిడాలోని సెక్టార్ 49లోగల బరోలా అనే గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు లేచి చూసిన తల్లిదండ్రులకు వారిద్దరు చెట్టుకు వేలాడుతూ కనిపించారు.
దూరపు బంధువు హత్య చేశాడని..
కాగా, తమకు దూర బంధువు అయిన రవి అనే యువకుడు తమ కూతుళ్లను హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రవికి ఇది వరకే వివాహమైందని, అయినా కూడా తమ పెద్ద కూతురును ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని, తన తల్లిదండ్రులను తీసుకొచ్చి గొడవ కూడా చేశాడని వారు చెప్పారు.
తమను హెచ్చరించాడని...
తన మాట వినకపోతే ఇద్దరు కూతుళ్లకు కూడా ప్రమాదమేనని కూడా హెచ్చరించినట్లు వారు చెబుతున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఏదీ నిర్దారించలేకపోతున్నారు. మృతుల శరీరాలపై గాయాలు కూడా లేవని తెలిపారు..
2014లో అచ్చం ఇలాగే...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాదౌన్ గ్రామంలో 2014లో ఇలాగే ఇద్దరు అక్కాచెలెళ్ల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిపై అత్యాచారం చేసి వారిని చంపేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు అనేక మలుపులు తిరిగింది. అయితే, వారిపై నేరం జరిగినట్లు ఆధారాలు లేవని, వారు ఆత్మహత్య చేసుకున్నారని సిబిఐ తేల్చింది.