యోగీ సర్కారుకు భారీ షాక్- కాన్పూర్ "లవ్ జిహాద్" కేసుల్లో కుట్ర లేదని తేల్చిన సిట్
ఉత్తర్ప్రదేశ్లో "లవ్ జిహాద్" పేరుతో విదేశీ కుట్ర జరుగుతోందంటూ నానా హంగామా చేస్తున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లవ్ జిహాద్ పేరుతో యువతులను వల వేస్తూ విదేశీ ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపిస్తున్న యోగీ సర్కారు తాజాగా కాన్పూర్ ఘటనలపై సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్రా జరగలేదని సిట్ అధికారులు తేల్చారు.
కాన్పూర్లో సిట్ లవ్ జిహాద్ పేరుతో జరిగిన 14 ఘటనలను గుర్తించింది. ఇందులో 11 ఘటనల్లో ఎలాంటి నేరపూరిత కుట్ర కానీ, విదేశీ హస్తం కానీ ఉన్నట్లు తమకు ఆధారాలు లభించలేదని సిట్ తాజాగా పేర్కొంది. దీంతో లవ్ జిహాద్ పేరుతో విదేశీ కుట్ర జరుగుతున్నట్లు యోగీ సర్కారు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది. బీజేపీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఆరెస్సెస్, వీహెచ్పీ వంటి సంస్ధలు కొందరు ముస్లిం యువకులు, హిందూ యువతులను లొంగ దీసుకోవడాన్ని లవ్ జిహాద్గా పేర్కొంటూ కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇదేం నేరం కాదన్నట్లుగా మిగతా పార్టీలు వారిని తప్పుబడుతున్నాయి.
సిట్ దర్యాప్తు చేసిన 14 కేసుల్లో యువతుల తల్లితండ్రులు, ముస్లిం యువకులు తమ పిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించినట్లు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఇందులో ప్రమేయమున్న యువకులు అంతా కలిసి వ్యవస్ధీకృతంగా పనిచేశారని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని సిట్ తేల్చినట్లు ఆయన పేర్కొన్నారు.
అలాగే విదేశాల నుంచి వీరికి నిధులు అందినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులు తమ పేర్లు మార్చుకుని యువతులను పెళ్లి చేసుకున్నట్లు మాత్రమే తేలింది. ఇలా తేలిన 11 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.మరో మూడు కేసుల్లో మేజర్లుగా ఉన్న యువతులు తమ ఇష్టంతోనే వారిని పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణ అయింది.