మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యండి: కోర్టులో ఎస్ఐటీ అర్జీ, అక్రమ గనులు !
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యాలని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం అర్జీ సమర్పించి మనవి చేసింది.
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యాలని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం అర్జీ సమర్పించి మనవి చేసింది. గాలి జనార్దన్ రెడ్డి విచారణకు సక్రమంగా హాజరుకావడం లేదని ఎస్ఐటీ ఆరోపించింది.
అక్రమ గనుల వ్యవహారంపై విచారణ చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి విచారణకు హాజరుకావడం లేదని, అందువలన ఆయన బెయిల్ రద్దు చెయ్యాలని ఎస్ఐటీ అధికారులు లోకాయుక్త ప్రత్యేక కోర్టులో మనవి చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు ఇదే సందర్బంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యకూడదని మనవి చేశారు. గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు, ఎస్ఐటీ న్యాయవాదుల వాదనలు విన్న లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం విచారణ నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమ గనుల వ్యహారం గాలి జనార్దన్ రెడ్డి మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 11 కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి ముందస్తు జామీను తీసుకున్నారు. వారంలో ఒక్క రోజు ఎస్ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని గాలి జనార్దన్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది.
అయితే జామీనులో ఉన్న షరుతులు సడలించాలని, నెలకు ఒక్క రోజు విచారణకు హాజరు అయ్యే విధంగా ఆదేశించాలని గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు. షరతులు సడలించకూడదని ఎస్ఐటీ అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.