కశ్మీర్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. సీతారాం ఏచూరికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ : సీపీఐ (ఎం) అగ్రనేత సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాలపై సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన 15 వ్యాజ్యాలపై బుధవారం నాడు జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం బుధవారం (28.08.2019) నాడు విచారణ చేపట్టింది. ఆ క్రమంలో వాదనలు స్వీకరించిన ధర్మాసనం.. సీతారా ఏచూరి పిటిషన్ను కూడా విచారించింది. దాంతో ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లేందుకు ఓకే చెప్పింది.
సీతారాం ఏచూరి కశ్మీర్ పర్యటనకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు కొన్ని షరతులు పెట్టింది. రాజకీయ పర్యటనకు అనుకూలంగా మలచుకోవద్దని అభిప్రాయపడింది. రూల్స్ బ్రేక్ చేయకుండా కేవలం తన సహచరుడైన మహ్మద్ యూసుఫ్ తరగమిని మాత్రమే కలిసిరావాలని కండిషన్స్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘించొద్దని సూచించింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
వామ్మో కేటుగాళ్లు.. బ్యాంకులే టార్గెట్.. ఎలా కొల్లగొడుతున్నారంటే..!
ఆర్టికల్ 370 రద్దు దరిమిలా కశ్మీర్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో కశ్మీర్ పర్యటనకు వెళ్లిన విపక్ష నేతలను శ్రీనగర్ ఎయిర్పోర్టులో అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించారు పోలీసులు. అయితే ఆ బృందంలో సీపీఐ (ఎం) నేత యూసుఫ్ తరిగమి కూడా ఉన్నారు. అయితే పోలీసుల నిర్భందంలో ఉన్న తరిగమి అనారోగ్యానికి గురయ్యారు. దాంతో అతడిని చూసేందుకు వెళ్లిన క్రమంలో సీతారాం ఏచూరిని అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. చివరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తరిగమిని కలిసేందుకు సీతారాం ఏచూరికి పర్మిషన్ ఇచ్చింది.
అనంతనాగ్ జిల్లాకు చెందిన జామియా మిలియా ఇస్లామియాకు చెందిన విద్యార్థి మహ్మద్ అలీం సయ్యద్ను కూడా సుప్రీంకోర్టు కనికరించింది. సొంత గ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూసి వచ్చేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. అవసరమైన పక్షంలో ప్రభుత్వం అలీకి తగిన రక్షణ కల్పించాలని ఆదేశించింది.