శుక్రవారం నాడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నవి ఇవే..!
ఢిల్లీ : కేంద్ర బడ్జెట్కు మరో రెండు వారాల సమయముంది. ఆ క్రమంలో శుక్రవారం (21.06.2019) నాడు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే ఛాన్సుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆటోమొబైల్, కన్స్స్ట్రక్షన్ రంగాలను ప్రోత్సహించే అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని అంటున్నారు నిపుణులు. ఆటోమొబైల్, సిమెంట్ రంగాలపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో ఒడిదుడుకుల కారణంగా ఆటో పరిశ్రమకు జీఎస్టీ పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు.
వెజ్లో నాన్వెజ్ ముక్కలు.. అసెంబ్లీ క్యాంటీన్లో వెలుగుచూసిన నిర్వాకం
అదే క్రమంలో సిమెంట్ పరిశ్రమలో నెలకొన్న స్తబ్ధత కారణంగా ఇక్కడ కూడా జీఎస్టీ పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒకవేళ అలా చేస్తే గనక ప్రస్తుతం నిస్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. కాగా సిమెంట్ రంగంపై పన్ను రేటును 18 శాతానికి తగ్గిస్తే ప్రభుత్వ ఖజానాకు 12 వేల కోట్ల రూపాయల నుంచి 14 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందనేది ఒక అంచనా.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబ్ల్లోకి తీసుకురావడంపైనా ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు భారీ కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు 50 కోట్ల రూపాయలకు పైబడిన లావాదేవీలకు సంబంధించి ఈ-ఇన్వాయిసింగ్ను తప్పనిసరి చేయడంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.