నియంత్రణ రేఖ వెంబడి ఏ క్షణమైనా పరిస్థితులు తీవ్రతరం కావచ్చు: ఆర్మీ చీఫ్ రావత్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఏ క్షణమైనా పరిస్థితులు తీవ్రతరం కావచ్చని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం స్పష్టం చేశారు.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి కాల్పుల ఉల్లంఘనలు ఎక్కువైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు.
2019 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 950 కాల్పుల ఉల్లంఘన ఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి లోక్సభలో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
పాక్కి రాజ్నాథ్ హెచ్చరిక
రఫేల్ యుద్ధ విమానాలు భారత చేతికందాక.. పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసేందుకు భారత బలగాలు సరిహద్దులను దాటి వెళ్లాల్సిన అవసరం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అన్నారు. స్వదేశం నుంచే ఆ పనిని పూర్తి చేయొచ్చని స్పష్టం చేశారు. రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని అన్నారు.
భారత్-అమెరికా 2+2 చర్చల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న రాజ్నాథ్.. న్యూయార్క్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం ప్రభావం భారత్ పై కూడా ఉందని చెప్పారు. త్వరలోనే మనదేశ ఆర్థిక వ్యవస్థ విషమ పరిస్థితులను అధిగమిస్తుందని అన్నారు.