లఢక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు: తిప్పి కొడతాం: వ్యూహాత్మకంగా
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వద్ద పరిస్థితులు అత్యంత సున్నితంగా, సమస్యాత్మకంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె అన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనడానికి సైన్యం సమాయాత్తమై ఉందని చెప్పారు. శతృవుల నుంచి ఎదురయ్యే సవాళ్లను తిప్పి కొట్టగలమని అన్నారు. సరిహద్దు భద్రతా బలగాలు అనుక్షణం అప్రమత్తతో ఉంటున్నాయని, ఆ అప్రమత్తే.. చైనా సైనికుల చొరబాటు యత్నాలను తిప్పి కొట్టడానికి సహాయపడిందని నరవణె పేర్కొన్నారు. కఠిన వాతావరణంలోనూ క్రమశిక్షణతో మెలుగుతున్నారని ఆయన ప్రశంసించారు.
కిందటి నెల 29, 30 తేదీల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ లేక్ సమీపంలో చైనా బలగాలతో చోటు చేసుకున్న ఘర్షణాత్మక పరిస్థితుల అనంతరం ఆయన లేహ్లో పర్యటిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం లేహ్కు చేరుకున్న ఆయన రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం లఢక్ తూర్పు సెక్టార్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. జూనియర్ కమిషన్డ్ అధికారులతో సమావేశం అయ్యారు. వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన సైనిక బలగాలు, అక్కడి స్టాక్ పొజీషన్ గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణె మాట్లాడారు. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదని అన్నారు. ఉద్రిక్తత కొనసాగుతోందని చెప్పారు. సరిహద్దు వెంబడి భౌగోళికంగా కొన్ని కీలక ప్రాంతాల్లో పరిస్థితులు సమస్యాత్మకంగా, సున్నితంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనడానికి, వాటిని తిప్పి కొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. సరిహద్దు వివాదాలను శాంతియుత వాతావరణంలో, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనే అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం ఉందని అన్నారు.
రక్షణపరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనేది ఇప్పటికే సిద్ధం చేసుకున్నామనీ నరవణె తెలిపారు. తాము చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని అన్నారు. దేశ రక్షణలో ఎలాంటి రాజీ పడబోమని అన్నారు. మూడు నెలలుగా వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తత కొనసాగుతోందని గుర్తు చేశారు. ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని అన్నారు. పరిస్థితులు చేయి దాటకుండా ఉండటానికి లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారుల ద్వారా చర్చలను చేపట్టామని, అనంతరం బ్రిగేడియర్ అధికారుల స్థాయికి దాన్ని తీసుకెళ్లామని అన్నారు.