అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..
'ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలుగురోజులుగా కొనసాగుతోన్న హింసలో 22 మంది చనిపోవడం, దీనిపై సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేయడం, ఢిల్లీ పోలీసులపైనా జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సర్కారు డిఫెన్స్ లో పడినట్లయింది. సరిగ్గా ఆసమయంలోనే రంగంలోకి దిగిన దోవల్.. తన కమాల్ ను ప్రదర్శించారు.
Recommended Video
మొదటి వ్యక్తి దోవలే..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో ఆల్లర్లు మొదలైనప్పటి నుంచి ఏ రాజకీయపార్టీ నేతగానీ, ప్రభుత్వ ఉన్నతాధికారులుగానీ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. పోలీసులతోపాటు రెండు వర్గాలకు చెందిన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టులపైనా దాడులు జరిగాయి. వాతావరణం భయానకంగా మారడంతో నేతలెవరూ అటువెళ్లే సాహసం చేయలేదు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ మాత్రం మంగళవారం రాత్రి నుంచి ఈశాన్య ఢిల్లీలోని ఉన్నారు. బుధవారం సాయంత్రం మౌజ్పూర్ ప్రాంతాన్ని సందర్శించారు.
స్థానికులకు భరోసా..
కొందరు పోలీస్ అధికారులు, మీడియా ప్రతినిధులు వెంటరాగా ఎన్ఎస్ఏ దోవల్.. మౌజ్పూర్ వీధుల్లో కలియదిరిగారు. బాధతో ఇళ్ల ముందు కూర్చున్న స్థానికులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై, పోలీసులపై నమ్మకం ఉంచాలని, అంతా సర్దుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతకుముందే ఈశాన్య ఢిల్లీ డీసీపీ ఆఫీసులో అల్లర్ల పరిస్థితిపై ఆయన సమీక్ష జరిపారు. మంగళవారం రాత్రి కూడా దోవల్ ఈశాన్య ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే.
పరిస్థితి అదుపులోకి వచ్చింది..
‘‘పోలీసులు తమ శక్తిమేరకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అన్ని మతాల వాళ్లు శాంతి, సామరస్యంతో మెలగాలని కోరుతున్నాను. ఇలాంటి కఠిన సందర్భాల్లోనే మనమంతా ఒక్కటిగా నిలబడాలి. అవసరం ఉన్న ప్రతిఒక్కరికీ సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది''అని దోవల్ చెప్పారు.
అమిత్ షా మాటిదే..
అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీలో అల్లర్లు, హింస కారణంగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో శాంతిభద్రతల పునరుద్ధరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిందని భద్రతా సలహాదారు దోవల్ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామన్నారు. ప్రస్తుతానికి అల్లర్లు ఆగిపోయినట్లుగా భావించొచ్చా? అని విలేకరులు అడగగా.. ‘నమ్మకంగా ఉండండి' అని దోవల్ బదులిచ్చారు. బుధవారం ఉదయం నుంచి కొత్తగా అల్లర్లు జరగనప్పటికీ.. గత మూడ్రోజులుగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవాళ్లు చనిపోతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతున్నది.