మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: వీడియో తీసి వాట్సాప్లో షేర్..
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని బోజ్పుర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరుగురు యువకులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అత్యాచార దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వికృతానందం పొందారు. జనవరి 31వ తేదీన జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
గ్యాంగ్ రేప్ చేసి వాట్సాప్లో..:
బాధితురాలి తండ్రి చెప్పిన దాని ప్రకారం.. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆరుగురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తతంగాన్నంతా వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. బహారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
14ఏళ్ల మైనర్..:
సంఘటనపై బాధితురాలి తండ్రి పాట్నాకు 55కి.మీ దూరంలో ఉన్న అరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితురాలు 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల మైనర్ బాలిక అని అరా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పూనమ్ కుమారి తెలిపారు.
ఒకరి అరెస్ట్:
నిందితుల్లో ఒకడైన క్రిష్ణా యాదవ్ను అదుపులోకి తీసుకున్నట్టు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పూనమ్ తెలిపారు. తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి తండ్రి పోలీసులను వేడుకుంటున్నారు.
ఇది రెండో సంఘటన:
గడిచిన కొద్దిరోజుల్లో ఇలాంటి సంఘటన బీహార్ లో రెండోసారి చోటు చేసుకోవడం గమనార్హం.డిసెంబర్ 21న బహిర్భూమి కోసం బయటకెళ్లిన ఓ ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేసి హతమార్చాడు. థరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.