ధనిక రాష్ట్రంలో దారుణం .. అన్నం లేక మట్టి తింటున్న చిన్నారుల దైన్యం
భారతదేశం అన్నపూర్ణ అని గొప్పగా చెప్తారు కానీ తినడానికి తిండి లేని దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు భారతదేశం నిండా కనిపిస్తారు. దేవతలు నడియాడే ప్రదేశంగా గొప్పగా చెప్పే సంపన్న రాష్ట్రమైన కేరళలో అన్నం లేక ఆకలితో అలమటిస్తూ మట్టి తింటున్న చిన్నారుల దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
కేరళలోని తిరువనంతపురంలో దయనీయమైన ఘటన ..
పేదరికంతో పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని ఓ తల్లి కంటికి కడివెడు కన్నీరు కారుస్తుంటే,ఆకలి తీర్చుకోవడానికి చిన్నారులు మట్టి, బురద తింటున్న దయనీయమైన స్థితి తల్చుకుంటేనే ఆవేదన కలుగుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఒక రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకున్న ఉదంతం ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేసింది . శ్రీదేవి అనే మహిళ కేరళలోని తిరువనంతపురంలో ఓ రైల్వే వంతెన కింద తన ఆరుగురు పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఆ పిల్లలంతా ఏడేళ్లలోపు వయసు ఉన్న చిన్నారులే .
ఆకలి బాధ తాళలేక మట్టి తింటున్న చిన్నారులు
పుట్టెడు పిల్లలు ఉన్న ఒక తల్లి వారికి కడుపు నిండా కూడా పెట్టలేని దయనీయమైన స్థితి బయటకు వచ్చింది. దీంతో పిల్లలు తమ ఆకలి తీర్చుకునేందుకు మట్టిని, బురదను తింటున్న వైనం వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన భర్త ఒకవైపు.. ఆరుగురు పిల్లలు మరోవైపు ఉన్న నేపథ్యంలో వారి ఆకలి ఎలా తీర్చాలో అర్థం కానీ దీన పరిస్థితుల్లో ఆ తల్లి ఉంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కేరళ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం తో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
నలుగురు పిల్లల పోషణా బాధ్యత తీసుకున్న బాలల సంరక్షణ కమిటీ
ఈ క్రమంలోనే అకలి బాధను తాళలేక మట్టితిన్న పిల్లలను చూసి స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు . పిల్లలను పెంచే స్తోమత లేదని బాలల సంరక్షణ కమిటీకి శ్రీదేవి ఇప్పటికే ఓ లేఖ రాసింది. దీనిపై స్పందించిన అధికారులు ఆమెకు తిరువనంతపురంలో ఉద్యోగం ఇవ్వటంతో పాటు ఆ పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టి ఆదుకుంటున్నారు. తండ్రి మద్యం తాగి వచ్చి భార్యాపిల్లలను కొడుతుంటాడని స్థానికులు చెప్పారు.
విమర్శల నేపధ్యంలో తల్లికి తాత్కాలిక ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ..
ఇక నిరుపేద మహిళ వద్ద నెలన్నర వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు మినహా మిగిలిన నలుగురు పిల్లల్ని శిశు సంరక్షణ సమితి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంది. ఆ తల్లికి తాత్కాలిక ఉద్యోగాన్ని ఇచ్చి జీవించమని చెప్పింది కేరళ ప్రభుత్వం .ఈ ఉదంతం వెలుగు చూసిన వెంటనే తిరువనంతపురం మేయర్ స్పందించారు. తాజాగా లైఫ్ మిషన్ పథకం కింద నిర్మిస్తున్న అపార్ట్ మెంట్లో ఒక ఫ్లాట్ ను సైతం ఆ మహిళకు కేటాయించారు. సంపన్న రాష్ట్రం గా చెప్పబడే కేరళ రాష్ట్రంలో చిన్నారులకు తినడానికి తిండి లేదు అన్న కఠోర నిజం కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తుంది. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. నిరుపేదల ఆకలి తీర్చే ఎన్ని పథకాలు ప్రభుత్వాలు అందిస్తున్నా అవి వారి చెంతకు చేరటం లేదు అని చెప్పటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ .