ఆరు మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు డుమ్మా, సీఎంకు చుక్కలు చూపించాలి!
బెంగళూరు: కర్ణాటకలో బుధవారం (ఫిబ్రవరి 6) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి తలనొప్పి మొదలైయ్యింది. అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుంటే సంకీర్ణ ప్రభుత్వంతో ఆడుకుని అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
118కి పడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య
కుమారస్వామి ప్రభుత్వానికి ఇంత కాలం మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. అయితే ఇప్పుడు 118 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఆరు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరుకాకుంటే ఆ సంఖ్య 112కు పడిపోతుంది. ప్రభుత్వానికి కనీసం 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒక్క ఎమ్మెల్యే తక్కువగా ఉండటంతో బీజేపీకి అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి ఇదే మంచి చాన్స్.
ఎమ్మెల్యేల తిరుగుబాటు
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జారకిహోళి, ఉమేష్ జాదవ్, మహేష్ కమటహళ్ళి సంకీర్ణ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్బంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బి, నాగేంద్ర, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ తో బీజేపీ నాయకులు చర్చలు జరిపారు. ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో చాల రోజుల నుంచి మాయం అయ్యారు. ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
రణరంగం చెయ్యాలి
శాసన సభ సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీలో రణరంగం చెయ్యడానికి బీజేపీ నాయకులు సిద్దం అయ్యారు. ఎమ్మెల్యే గణేష్ ను ఇన్ని రోజులు అయినా అరెస్టు చెయ్యకపోవడం, సీఎం కుమారస్వామి కాంగ్రెస్ మీద చేసిన విమర్శలు, నిజాయితీ అధికారుల బదిలీలు, మాజీ సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలను అసెంబ్లీలో లేవనెత్తి రచ్చరచ్చ చెయ్యాలని బీజేపీ నాయకులు పక్కా ప్లాన్ వేసుకున్నారు. మొత్తం మీద శాసన సభ సమావేశాలు పూర్తి అయ్యేలోపు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు పక్కా ప్లాన్ వేసుకుంటున్నారు.