కథువా కేసులో కీలక తీర్పు.. ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం..
పఠాన్కోట్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో కోర్టు కీలక తీర్పు చెప్పింది. గతేడాది 8ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు తీర్పు చెప్పిన పఠాన్ కోట్ న్యాయస్థానం మధ్యాహ్నం రెండింటికి దోషులకు శిక్ష ఖరారు చేయనుంది.
కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, పోలీసు అధికారులు ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సరేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్లతో పాటు మరో ఇద్దరు నిందితులను కోర్టు దోషిగా తేల్చింది. సాంజీరామ్ కుమారుడు విశాల్ను నిర్దోషిగా ప్రకటించింది.
గతేడాది జనవరిలో జమ్ముకాశ్మీర్లోని కథువాకు చెందిన 8ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. రసానా గ్రామానికి చెందిన బాలిక 2018 జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీనిపై పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారం రోజుల అనంతరం బాలిక మృతదేహం దొరికింది. పోస్ట్మార్టం రిపోర్టులో బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.
భూవివాదం కారణంగా ఏర్పడిన విద్వేషంతో అభంశుభం తెలియని చిన్నారిపై కొందరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు క్రైమ్ బ్రాంచి విచారణలో తేలింది. కేసు విచారణపై అనుమానాలు వ్యక్తమవడంతో సుప్రీంకోర్టు దాన్ని పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. మరికాసేపట్లో దోషులకు శిక్ష ఖరారు చేయనుంది.