నిద్రలోనే కానరాని లోకాలకు: విషవాయువు పీల్చి ఐదుగురు చిన్నారులు మృతి
ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఘజియాబాద్ లోని పట్టణంలో ఐదుగురు చిన్నారులు , 40 ఏళ్ల మహిళ ఉత్తరాంచల్ విహార్ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం నిద్రకు ఉపక్రమించారు. ఓ వివాహ వేడుక నిమిత్తమై ఇద్దరి చిన్నారులను వారి తల్లిదండ్రులు పర్వీన్ అనే మహిళ ఇంట్లో వదిలి వెళ్లారు. పర్వీన్ ఇంట్లో ఆమె పిల్లలతో పాటు ఈ చిన్నారులు కూడా నిద్రకు ఉపక్రమించారు.
చలి వేస్తుండటంతో తలుపులు కిటికీలు బంద్ చేసి పడుకున్నారు. ఇక అంతా కాసేపు మాట్లాడుకుని నిద్రలోకి జారుకున్నారు. ఇక అర్థరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మరియు టీవీలకు నిప్పు అంటుకుంది.అప్పటికే వారు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పటికే ఫ్రిడ్జ్ నుంచి వాయువు బయటకు వెలువడింది. నిద్రలో ఉన్న వీరు ఆ వాయువును పీల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాదు వారి శరీరాలు కూడా స్వల్పంగా కాలినట్లు ఘజియాబాద్ రూరల్ ఎస్పీ నీరజ్ కుమార్ చెప్పారు.
ఇక వారి ఇంట్లో వారంతా మీరట్లో ఓ వివాహ వేడుకకు వెళ్లారు. ఆ సమయంలోనే వీరుంటున్న మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ఫ్లోర్లో ఈ ప్రమాదం సంభవించింది. అయితే పోస్టుమార్టం తర్వాతే వారి మృతికి గల కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. అయితే ఇంటిని దట్టమైన పొగ కమ్మేయడంతోనే ఆరుగురు మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఇదిలా ఉంటే స్కూలుకు వెళ్లేందుకు సమయం దాటిపోతున్నప్పటికీ ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు తలపులను కొట్టారు. ఎంతకూ తలపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. తలుపులు పగలగొట్టి చూడగా ఆరుగురు విగతజీవులుగా కనిపించారని పొరుగింటివారు చెప్పారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.