విషాదం : షార్ట్ సర్క్యూట్తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మౌలానా ఆజాద్ కాలనీలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను ప్రవీణ్(40),ఫాతిమా(12),సాహిమా(10),రతియా(8),అబ్దుల్ అజీమ్(8),అబ్దుల్ అహద్(5)లుగా గుర్తించారు.ఒక్కసారిగా మంటలు చెలరేగి గది మొత్తం వ్యాపించాయని.. దాంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల ఢిల్లీలోని రాణీ ఝాన్సీ మార్గ్లోని అనాజ్ మండీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 43 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.గత నవంబర్ నెలలో యూపీలోని గోమతి నగర్ విభూతి ఖండ్ ఫ్లై ఓవర్ కింద ఉన్న మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఫైరింజన్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.