రెండు ఎన్కౌంటర్లు: ఆరుగురు మావోయిస్టులు మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో శని, ఆదివారాల్లో చోటుచేసుకున్న రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బాలంగిర్ జిల్లాలో ఇద్దరు, కంధమాల్ జిల్లాలో నలుగురు హతమయ్యారు.
బాలంగిర్ ఎస్పీ శిబ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం... బేల్పడా సమితి డుడుకామల గ్రామ సమీపంలో 15 మందికిపైగా మావోయిస్టులున్నట్లు అందిన సమాచారంతో శనివారం రాత్రి బేల్పడా, తురేయిఖెల్, ఖొప్రాఖొల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మిగిలినవారు తప్పించుకున్నారు. మరో ఘటనలో కజురుపొడ సమితి పరిధిలోని సుడ్రుకుంప-గొలంకి అటవీ ప్రాంతంలో సుమారు 13 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఎస్ఓజీ, డివీఎఫ్ల సంయుక్త బలగాలు అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం కూంబింగ్ చేపట్టాయి. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన వారు పారిపోయారు.
మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు భారీ మొత్తంలో పేలుడు సామగ్రి, తుపాకులు, బుల్లెట్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.