ఒకే ఫ్యామిలో ఆరుగుర్ని మింగేసిన ఇసుక లారీ
లుథియానా (పంజాబ్): డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఆరుగురి ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సంఘటన పంజాబ్ లో జరిగింది. నిద్రలోనే ఒకే కుటుంబంలోని ఆరు మంది సజీవ సమాధి అయ్యారని పోలీసులు తెలిపారు.
పంజాబ్ లోని లూథియానా సమీపంలో ఒక భవనం నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఒక గుడిసెలో రాజు (32), మాన్సీ (30), వీరి పిల్లలు అశు (10), నిహాల్ (5), షీతల్ (3), ఖుషి (1) నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి వీరు భోజనం చేసి నిద్రపోయారు.
అర్దరాత్రి దాటిన తరువాత నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర ఇసుక అన్ లోడ్ చెయ్యడానికి టిప్పర్ లారీ వెళ్లింది. తరువాత డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. టిప్పర్ వాహనం నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరకు కాకుండా పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకు వెళ్లింది.
టిప్పర్ వాహనం దూసుకు వెళ్లడంతో రాజు, మాన్సీ, అశు, షీతల్, ఖుషి, నిహాల్ కు తీవ్రగాయాలైనాయి. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరుగురు కూడా సంఘటనా స్థలంలో మరణించారని వైద్యులు చెప్పారని డిప్యూటి పోలీసు కమిషనర్ హరపాల్ సింగ్ తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.