సూరత్లో గాడ్సే జయంతి వేడుకలు.. ఆరుగురి అరెస్ట్
సూరత్ : నాథూరామ్ గాడ్సే జయంతి నిర్వహించి ఆరుగురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. మహాత్మా గాంధీని హత్యచేసిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్లోని లింబాయత్ ప్రాంతంలో సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దారుణం : ఎస్సైను కొట్టి చంపిన గ్యాంగ్స్టర్
ఆలయ పూజరి హిరేన్ సుమ్రా నేతృత్వంలో గాడ్సే జయంతి వేడుకలు జరిగాయి. గాడ్సే ఫొటో చుట్టూ 100 దీపాలు వెలిగించిన నిందితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. గాడ్సేను స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15 మంది యువకులు హాజరయ్యారు. ఈ దృశ్యాలు లోకల్ ఛానెల్లో ప్రసారం కావడం, ఫొటోలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఆలయం వద్దకు చేరుకున్న సూరత్ పోలీసులు పూజారి సుమ్రాతో పాటు వాలా భర్వాద్, వైరల్ మాల్వీ, హితేశ్ సోనార్, యోగేశ్ పటేల్, మనీష్ కలాల్ అనే ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై వారిపై ఐపీసీలోని 153, 153ఏ, 153బి సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. మహాత్ముని చంపిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం బాధాకరమన్న సూరత్ పోలీస్ కమిషనర్... ఇలాంటి చర్యలను ఉపేక్షించమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.