మరో ఎన్కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి
నాగ్పూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సల్స్ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్ షెలార్ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు.
కాగా, ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరికొన్ని నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కూంబింగ్ ఆపరేషన్కు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని ఐజీ తెలిపారు.
మందుపాతర పేలి ముగ్గురు మృతి
ఒడిశా రాష్ట్రంలోని నబరంగపూర్ జిల్లా రాయ్గర్ సమితి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర ప్రమాదవశాత్తూ పేలడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్గఢ్లో ఐదుగురు మావోల మృతి
సరిహద్దు చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు.