Ayodhya case: సున్నీ వక్ఫ్ బోర్డ్తో మీడియేషన్ ప్యానెల్ రహస్య మంతనాలా?: ముస్లిం పార్టీలు
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ఆరు ముస్లిం పార్టీలు మధ్యవర్తిత్వ ప్యానెల్(మీడియేషన్ ప్యానెల్) వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. మీడియేషన్ ప్యానెల్ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందంటూ ఆరోపించాయి. సెటిల్మెంట్ అనే ప్రశ్నే రావడం లేదని పేర్కొన్నాయి. ముస్లిం పార్టీల తరపు న్యాయవాది ఇజాజ్ మక్బుల్ ఈ మేరకు ప్రకటన చేశారు.
మీడియేషన్ ప్యానల్ మెంబర్, సీనియర్ అడ్వొకేట్ అయిన శ్రీరామ్ పంచు సున్నీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జాఫర్ ఫరూఖీతో రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఫరూఖీ ముస్లిం కమ్యూనిటికీ ప్రతినిధిగా వ్యవహరించడం లేదని, అలాగే హిందూ పక్షం కూడా సెటిల్మెంట్(పరిష్కారం) కోసం ప్రయత్నించడం లేదని అన్నారు.
మీడియేషన్ ప్యానెల్ తమ నివేదికలోని అంశాలను బయటికి వెల్లడం సరికాదని రెండు పేజీల్లోని తన ప్రకటనలో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కూడా మీడియేషన్ నివేదికలోని అంశాలు రహస్యంగా ఉంచాలని చెప్పిందని తెలిపారు. ఇలాంటి పనులు సమస్య పరిష్కారంపై ప్రభావితం చూపుతాయని అన్నారు.
ఇలా మీడియేషన్ ప్యానెల్ సమాచారాన్ని లీక్ చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని అన్నారు. అక్టోబర్ 16న పంచు కూడా సుప్రీంకోర్టు ఆవరణలోనే ఉన్నారని, ఆయన జాఫర్ ఫరూఖీతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. కాగా, మీడియేషన్ ప్యానెల్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో తుది తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అయోధ్య కేసులో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం సమావేశమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో ఈ సమావేశం జరుగుతోందని, అయోధ్య కేసుపై కీలక చర్చ జరుగుతోందని వన్ఇండియాకు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.