ఆరు కరోనా వైరస్ కేసులు నమోదు: ఇటలీ, దుబాయ్ నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కొత్తగా మరో ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడినట్టుగా అనుమానిస్తోన్న ఈ ఆరుమందినీ వేర్వేరు ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచారు. వారి రక్తనమూనాలను సేకరించి, పరీక్షల కోసం పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఆగ్రాకు చెందిన వారిగా నిర్ధారించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ నెట్వర్క్ కింద అనుమానితులను గుర్తించారు. అనుమానితులను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో తిష్ట వేసిన కరోనా: పాజిటివ్ కేసు: దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిలో: కేంద్రం కన్ఫర్మ్
వారంతా ఇటలీ, దుబాయ్ నుంచి వచ్చిన వారిగా నిర్ధారించారు. భారత్లోని పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి ఇటలీ నుంచి 25 మంది పర్యాటకులు తొలుత జైపూర్కు వెళ్లారు. అక్కడి నుంచి తాజ్మహల్ను సందర్శించడానిక ఆగ్రాకు చేరుకున్నారు. ఆగ్రాలోని ఓ హోటల్కు చేరిన అనంతరం వారిలో ముగ్గురు అనారోగ్యానికి గురయ్యారు. వారిని పరీక్షించగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు.
వారితో పాటు రాజధాని లక్నోకు చెందిన ఓ వ్యక్తిలో కూడా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతణ్ని స్థానిక లోక్ బంధు ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా షూల తయారీ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు వ్యాపార కార్యకలాపాల కోసం ఇటలీకి వెళ్లి వచ్చారు. వారిలో కూడా వైరస్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన అయోధ్య జిల్లాలోని రుడౌలి గ్రామానికి చెందిన రుక్సర్ ఖాన్ అనే వ్యక్తిని కూడా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వారందర్నీ వేర్వేరు ఆసుపత్రులకు తరలించి డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్లు ఉత్తరప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు.