మమతకు త్రిపుర షాక్: బీజేపీలో చేరిన ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు
అగర్తాల: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. త్రిపురలో ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన తర్వాతి రోజే ఆ పార్టీలో చేరడం గమనార్హం.
అమిత్ షాతో కలిసినప్పుడే బీజేపీలో చేరతామని ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్లు బీజేపీ నార్త్ ఈస్ట్ ఎన్డీఏ కన్వీనర్ హిమాంత బిశ్వశర్మ తెలిపారు. అస్సాం మంత్రి కూడా అయిన బిశ్వశర్మ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
కాగా, బీజేపీలో చేరిన ఆ ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, అషిష్ షా, దిబా చంద్ర హ్రంఖావల్, బిస్వా బంధు సేన్, ప్రంజిత్ సింఘా రాయ్, దిలీప్ సర్కార్ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆదేశాలను ధిక్కరించి ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి చేరిక బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చినట్లయింది.