ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడే
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. అయితే రాజధాని ఢిల్లీతో పాటు ఐదు కీలక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండటం కేంద్రంతో పాటు అందరినీ కలవరపెడుతోంది.
Recommended Video
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 85 శాతం ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు చెప్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16838 కొత్త కేసులు నమోదైతే.. ఇందులో 84.4 శాతం కేసులు ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఇందులో గత 24 గంటల్లో మహారాష్ట్ర అత్యధికంగా 8998 కొత్త కేసులతో రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కేరళలో 2616 కేసులు, పంజాబ్లో 1071 కేసులు నమోదయ్యాయి.
అలాగే మరణాల విషయంలోనూ ఈ ఆరు రాష్ట్రాలు 88.5 శాతంతో ముందున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో 88 శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లో 113 మరణాలు నమోదైత ఈ జాబితాలోనూ మహారాష్ట్ర 60 మరణాలతో ముందుంది. పంజాబ్ 15, కేరళ 14, కర్నాటక 4, తమిళనాడు 4, ఛత్తీస్ఘడ్లో 3 మరణాలు చోటు చేసుకున్నాయి. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మృతులే లేకపోవడం ఊరటనిస్తోంది.
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వెయ్యికంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అయితే కేవలం 2 కేసులతో అట్టడుగు స్ధానంలో ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1.76 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివ్ కేసుల రేటు కూడా గతేడాది ఆగస్టులో ఉన్న 8.88 శాతంతో పోలిస్తే ప్రస్తుతం మార్చిలో 5.08 శాతం మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.