ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ: ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు సోకిన హెచ్1ఎన్1 వైరస్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో కూడా స్వైన్ ఫ్లూ కేసులు ఆందోళనలు రేపుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జీలు కూడా హెచ్1ఎన్1(స్వైన్ ఫ్లూ) వైరస్ బారిన పడినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
ఈ నేపథ్యంోల న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో పనిచసే వారికి స్వైన్ ఫ్లూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తో సీజే జస్టిస్ బోబ్డే సమావేశం నిర్వహించారని, సుప్రీంకోర్టులో పనిచేసే వారికి స్వైన్ ఫ్లూ రాకుండా నివారణ చర్యలపై చర్చించినట్లు వెల్లడించారు.
ఈ వ్యాధి విషయంలో అత్యవసర పరిస్థితులలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరామని తెలిపారు. అలాగే సుప్రీంకోర్టులో పనిచేసే వ్యక్తులకు టీకాలు వేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని తాము ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు చెప్పారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్ ఈ విషయాంపై మాట్లాడుతూ.. స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై బోబ్డే ఆందోళన వ్యక్తం చేశారని, టీకాలు వేసేందుకు వీలుగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
దేశంలోని పలు నగరాలతోపాటు కాశ్మీర్, బెంగళూరు, ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా రెండు మూడు కేసులు నమోదైనట్లు సమాచారం. ఇక బెంగళూరుకు చెందిన సాప్ ఇండియా సంస్థ తన ఉద్యోగుల్లో ఇద్దరికి హెచ్1ఎన్1 పాటిజివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా అన్ని కార్యాలయాలను శుభపర్చేందుకు మూసివేసింది. ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించింది.