నిఫా అలర్ట్... మరో ఆరుగురికి వైద్య పరీక్షలు.. వైరస్ సోకలేదని నిర్థారణ..
ఎర్నాకుళం : కేరళకు నిఫా భయం పట్టుకుంది. 23ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకడంతో ఆ వ్యాధి మళ్లీ విజృంభిస్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. నిఫా సోకినట్లు అనుమానించిన మరో ఆరుగురి బ్లడ్ శాంపిల్స్ను పరీక్షించగా.. వారి రిజల్ట్ నెగిటివ్ అని వచ్చింది. పూనేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు వారి బ్లడ్ శాంపిల్స్ వారికి వైరస్ సోకలేదని స్పష్టం చేసింది. వైరస్ సోకిన యువకునికి ప్రస్తుతం ఎర్నాకుళంలోని కలమస్సెరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
మళ్లీ నిఫా కలకలం.. కేరళలో మహమ్మారి ఆనవాళ్లు..?
నిఫా వైరస్ సోకినట్లు అనుమానించిన ఆరుగురిలో ఇద్దరు నర్సులు, ఒక నర్సింగ్ అసిస్టెంట్తో పాటు నిఫా బారిన పడిన యువకుడి స్నేహితులు, ఒక బంధువు ఉన్నారు. వారందరికీ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. నిఫా సోకిన పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగైందని జ్వరం తగ్గుతోందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన మందులు ఉపయోగించడంలేదని అన్నారు.
ఇదిలాఉంటే నిఫా వైరస్ సోకిన విషయం తెలియకముందు పేషంట్తో టచ్లో ఉన్న 314 మంది ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంక్యూబేషన్ పీరియడ్ ముగిసే వరకు వారిని అదే వార్డులో ఉంచనున్నట్లు చెప్పారు.
నిఫా వైరస్పై చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయ్ ఎర్నాకుళంలో కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నిఫా వైరస్ బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు త్రిసూర్, కొట్టాయం, కాలికట్ ప్రభుత్వ కాలేజీల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.