యువజన నైపుణ్యమే మన బలం: స్కిల్ ఇండియా.. ఆత్మనిర్భర్ భారత్: ఇవే లక్ష్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఇటీవలే గ్లోబల్ వీక్-20202 అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగించిన ఆయన.. మరోసారి అలాంటి ప్లాట్ఫామ్ ద్వారా దేశ యువజనులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా దేశ యువతను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. యువత, వారి నైపుణ్యాలే భారత బలం అని అన్నారు. స్కిల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్.. లక్ష్యాలను అందుకోవడంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అగ్రస్థానానికి చేరుకోవడంలో యువత కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
స్కిల్ ఇండియా మిషన్కు అయిదేళ్లు..
స్కిల్ ఇండియా మిషన్ ఆరంభించి బుధవారం నాటితో అయిదేళ్లు పూర్తయ్యాయి. అదే రోజు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం కూడా కావడంతో ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ప్రధాని వీడియో ద్వారా ప్రసంగించారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుందని వివరించారు. ఇందులో భాగంగా యువతను స్వయంసమృద్ధి దిశగా నడిపించడానికి స్కిల్ ఇండియా మిషన్ను అయిదేళ్ల కిందట ప్రారంభించినట్లు మోడీ గుర్తు చేశారు. స్కిల్ ఇండియా ద్వారా పలు కోర్సులను అందిస్తున్నామని చెప్పారు.
స్కిల్.. రీ స్కిల్
స్కిల్, రీస్కిల్డ్, అప్ స్కిల్డ్.. యువత మంత్రం ఇదే కావాలని అన్నారు. తనకు ఉన్న నైపుణ్యాన్ని తనకు తానుగా పెంపొందించుకోవడం, దాన్ని విస్తరింపజేయడం వంటి చర్యలు యువతకు ఉపాధిని కల్పిస్తాయని చెప్పారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి కాల పరిమితి లేదని, స్వయం సమృద్ధిని సాధించుకోవడానికి దీనికి మించిన మరో మార్గం లేదని మోడీ చెప్పారు. తన నైపుణ్యాన్ని పెంపొందించుకోలేని వాళ్లు తమ సొంత కుటుంబానికీ భారంగా పరిణమిస్తారని అన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వయస్సుతో ఏమాత్రం సంబంధం లేదని ప్రధాని చెప్పారు.
Recommended Video
నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే మార్గం..
నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం నిరంతర ప్రక్రియ అని మోడీ అన్నారు. ప్రతిభను పెంపొందింకోవడం.. డ్రైవింగ్ ఫోర్స్గా మారుతుందని చెప్పారు. దేశంలో నాలెడ్జ్, నైపుణ్యం చుట్టే ప్రస్తుతం పరిస్థితులు తిరుగుతున్నాయని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాము అయిదేళ్ల కిందట స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించామని చెప్పారు. అయిదు కోట్ల మందికి పైగా ప్రజలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పటికే ఇచ్చామని అన్నారు. ఆరోగ్యరంగంలో పురోగతి సాధించడానికి ఇది ఉపయోగపడిందని మోడీ చెప్పారు. దాని ప్రభావం వల్ల క్లిష్ట పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటున్నామని అన్నారు.