బీజేపీది బానిస మనస్తత్వం.. అందుకే ట్రంప్కు దాసోహం.. గరీబీ చుపావో మోదీ నినాదం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మోదీ సర్కారు చేస్తున్న పిచ్చిపనుల్ని చూసి ప్రపంచం నవ్వుకుంటున్నదని, స్వాతంత్ర్యం రావడానికి ముందు, బ్రిటన్ రాణికి ఇండియాలో స్వాగతం పలికినట్లు.. ఇప్పుడు మోదీ.. ట్రంప్ కోసం ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని, తద్వారా బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారని శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విమర్శించింది.
Recommended Video
శివసేన పార్టీ అధికారిక దినపత్రిక 'సామ్నా' సోమవారం నాటి ఎడిటోరియల్ లో మోదీ సర్కారుపై నిప్పులు చెరిగింది. అహ్మదాబాద్ లో ట్రంప్ జరిపే కేవలం 3 గంటల పర్యటనకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తుండటం దారుణమని, దీనికి కచ్చితంగా జవాబుచెప్పాలని సేన డిమాండ్ చేసింది. ట్రంప్ ప్రయాణించనున్న మార్గంలో పలు చోట్ల గుడిసెలు కనిపించకుండా గోడలు నిర్మించడాన్ని కూడా సేన తప్పుపట్టింది. నాటి ఇందిరా గాంధీ 'గరీభీ హఠావో' నినాదాన్ని ప్రస్తావిస్తూ... నేటి నరేంద్ర మోదీ సర్కారు తాజాగా 'గరీబీ చుపావో (పేదరికాన్ని దాచేయండి)' అనే పథకాన్ని మొదలుపెట్టారని శివసేన ఎద్దేవా చేసింది.
హ్యూస్టన్ లో 'హౌడీ మోదీ' తరహాలో అహ్మదాబాద్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, భారత ప్రధాని మోదీ పాల్గొనబోయే సభకు మొదట 'కెమ్ ఛో ట్రంప్' అని గుజరాతీ పేరు పెట్టారు. దీనిపై గందరగోళం ఏర్పడటంతో కార్యక్రమం పేరును 'నమస్తే ట్రంప్'గా మార్చినట్లు గుజరాత్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.