వెంటిలేటర్పై మాజీ ముఖ్యమంత్రి: పరిస్థితి విషమం: కరోనా నుంచి కోలుకున్న
గువాహటి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయనను వెంటిలేటర్పై ఉంచారు డాక్టర్లు. తీవ్ర ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆయన గౌహతి వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
శనివారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వశర్మ వెల్లడించారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఫలితంగా ఆయనను వెంటిలేటర్పై ఉంచినట్లు చెప్పారు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, వైద్యానికి శరీరం స్పందించట్లేదని, కొన్ని అవయవాలు పనిచేయట్లేదని పేర్కొన్నారు. ఆయనకు క్రమం తప్పకుండా నాణ్యమైన చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. ఫ్లూయిడ్స్ ఇస్తున్నారని అన్నారు.
ఫలితంగా- ఆయన ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని, అయినప్పటికీ.. వెంటిలేటర్పైనే చికిత్సను అందిస్తున్నట్లు గౌహతి మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ అభిజిత్ శర్మ చెప్పారు. ఆక్సిజన్ లెవెల్ 97కు చేరుకుందని, రక్తపోటు సాధారణ స్థాయిలో ఉందని చెప్పారు. బ్లడ్ ప్రెషర్ స్థిరంగా ఉండట్లేదని, తరచూ హెచ్చుతగ్గులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకే వెంటిలేటర్పై ఆయనను ఉంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
Recommended Video
అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) నుంచి నిపుణులను రప్పించామని, వారి పర్యవేక్షణలో తరుణ్ గొగోయ్కు చికిత్స అందిస్తున్నట్లు హిమాంత బిశ్వశర్మ పేర్కొన్నారు. 86 సంవత్సరాల తరుణ్ గొగోయ్.. మూడుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యం వల్ల క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ రాజకీయాల్లో ఉన్నారు. కాలియాబోర్ లోక్సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు.