పన్నెండేళ్లలో తొలిసారి.. జూన్లోనూ కనికరించని రుతుపవనాలు
Recommended Video
ఢిల్లీ : రుతుపవనాలు గతి తప్పాయి. కేరళలో వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా విస్తరిస్తాయని ఆశపడ్డ నిరాశే మిగిలింది. వాయు తుఫాను ప్రభావం, ప్రతికూల వాతవరణ పరిస్థితుల కారణంగా మందగించాయి. గత పుష్కరకాలంలో ఎన్నడూ లేనంతగా రుతుపవనాల వేగం మందగించిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా జూన్లో వర్షపాత లోటు 44శాతానికి చేరింది.
చురుగ్గా కదలని రుతుపవనాలు
సాధారణంగా ఏటా జూన్ మూడో వారానికి మూడింట రెండొంతుల ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయి. అయితే ఈసారి కేవలం 10 నుంచి 15శాతానికి మాత్రమే రుతుపవనాలు పరిమితం అయ్యాయి. ఫలితంగా జూన్ 1 నుంచి 44శాతం వర్షపాత లోటు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్నాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రస్తుతం రుతుపవనాలు విస్తరించినా అవి చురుగ్గా కదిలేందుకు వారం సమయం పడుదుందని ఐఎండీ చెప్పింది.
15 రోజులు ఆలస్యం
నిర్ణీత సమయం కన్నా 15 రోజులు ఆలస్యంగా రుతుపవనాల గమనం కొనసాగుతోందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం రుతుపనాలు చురుగ్గా కదిలేందుకు అనువైన వాతావరణం నెలకొనడంతో మరో రెండు మూడు రోజుల్లో కొంకణ్ తీరానికి చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. జూన్ 25 నాటికి మహారాష్ట్ర, జూన్ చివరి నాటికి మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆలస్యమైనా సాధారణ వర్షపాతం
రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఈ ఏడాది సరైన వర్షాలు పడవన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఆలస్యంగా వచ్చి మందకొడిగా సాగినా సాధారణ వర్షపాతం నమోదైన సందర్భాలున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. 2016లో జూన్ 8న కేరళ తీరాన్ని తాకిన రుతు పవనాలు జులై 13నాటికి దేశమంతటా విస్తరించాయి. ఆ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైంది. మరి కొన్నిసార్లు జూన్లో లోటును జులైలో పడిన వర్షాలు భర్తీ చేసిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు.