తమిళనాడు గవర్నర్గా ఎస్ఎం కృష్ణ? కారణాలివేనా...
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తమిళనాడు గవర్నర్గా నియమితులు కానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీలో చేరనున్నారు.
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తమిళనాడు గవర్నర్గా నియమితులు కానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీలో చేరనున్నారు.
ఆయన గత జనవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వొక్కలింగ వర్గానికి చెందిన నాయకుడు. ఎస్ఎం కృష్ణ చేరికతో ఆ ఓట్లపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మణిపూర్, గోవాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ ఉత్సాహంలో బీజేపీ తన తదుపరి టార్గెట్గా కర్నాటకను కూడా ఎంచుకుంది.
వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో గెలుపొందాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఎం కృష్ణను తమ వైపుకు రప్పించుకుంది. ఆయనను తమిళనాడు గవర్నర్గా పంపించే అవకాశాలున్నాయని అంటున్నారు.
దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. ఆయన బీజేపీలో చేరిన ఒకటి రెండు రోజుల్లో తమిళనాడు గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దక్షిణాదిన తమిళనాడు చాలా ముఖ్య రాష్ట్రం. జయలలిత మృతి తర్వాత ఆ రాష్ట్రంలోనూ పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
గత కొంతకాలంగా తమిళనాడుకు గవర్నర్ లేరు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎం కృష్ణతో పాటు ఆనందీబెన్ పటేల్ కూడా గవర్నర్ రేసులో ఉన్నారని తెలుస్తోంది.