మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ అల్లుడు సిద్దార్థ్ కు ఐటీ శాఖ షాక్: కాఫీడే యజమాని, అదే లింక్ !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు వీజీ. సిద్దార్థ్ కు ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. సిద్దార్థ్ కు చెందిన కాఫీడే ప్రధాన కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి కీలకమైన డాక్యూమెంట్లు పరిశీలిస్తున్నారు.
బెంగళూరులోని విఠల్ మాల్యా రోడ్డులో కాఫీడే ప్రధాన కార్యాలయం ఉంది. గురువారం ఉదయం (సెప్టెంబర్ 21వ తేదీ) 8 ఇన్నోవా కార్లలో ఒకే సారి వచ్చిన అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంగళూరులోని సదాశివనగర్ లోని సిద్దార్థ్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కాఫీడే సంస్థల యజమాని అయిన సిద్దార్థ్ కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ అల్లుడు. ముంబై, చెన్నై, చిక్కమగళూరు తదితర ప్రాంతాల్లోని కాఫీడే కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన ఎస్ఎం. కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశాంగ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్ గా ఎస్ఎం. కృష్ణ పని చేశారు. ఇటీవల కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇల్లు, కార్యాలయాలు, ఆయన సన్నిహితుడు రజనీష్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు.
రజనీష్ గతంలో కాఫీడే సంస్థలో పని చేశాడు. ఇప్పుడు కాఫీడే సంస్థలో జరుగుతున్న ఐటీ శాఖ అధికారుల సోదాలకు, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో జరిగిన ఐటీ సోదాలకు లింక్ ఉందని సమాచారం. మొత్తం మీద మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ అల్లుడు సిద్దార్థ్ కు ఐటీ శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.