ట్రంప్ కిమ్ సమావేశంపై చైనా గూఢచర్యానికి పాల్పడిందా..?
జూన్ 12న సింగపూర్లో జరిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ల చరిత్రాత్మక భేటీలో గూఢచర్యం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించింది సింగపూర్ ప్రభుత్వం. గూఢచర్యం జరిగిందని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలిపింది.
ట్రంప్ కిమ్ భేటీ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని కవర్ చేశారు. వీరందరికి సింగపూర్ ప్రభుత్వం ఓ గిఫ్ట్ ప్యాక్ అందించింది. ఇందులో స్టేషనరీ ఐటెమ్స్తో పాటు ఓ యూఎస్బీ ఫ్యాన్ డివైజ్ ఇచ్చారు. అయితే చిక్కంతా దీంతోనే వచ్చింది. ఈ చిన్న యూఎస్బీ ఫ్యాన్ డివైజ్ బ్లేడ్లు ఒక చిన్న మోటార్కు అనుసంధానమై ఉంటాయి. ఇక ఆ మోటార్ కంప్యూటర్కు ఉన్న యూఎస్బీ కేబుల్కు కనెక్ట్ అయి ఉంటుంది. యూఎస్బీ ఫ్యాన్స్ చైనాలో తయారైయ్యాయనే వార్తలు జోరుగా షికారు చేశాయి. సమావేశంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు చైనా ఈ ఫ్యాన్లలో ఓ డివైజ్ ఉంచినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.
ఫ్యాన్ మొదలవగానే ఎక్కడో దూరంగా ఉన్న హ్యాకర్లకు సమాచారం అందుతుందట. ఈ ఆరోపణలు ముందుగా ఫ్రాన్స్కు చెందిన ఓ రేడియో సంస్థ టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత బీబీసీ కూడా ప్రసారం చేసింది. యూఎస్బీ డివైజ్లను జర్నలిస్టులు తమ ల్యాప్టాప్కు కనెక్ట్ చేయొద్దంటూ బీబీసీ టెలికాస్ట్ చేసింది. యూఎస్బీ ఫ్యాన్లో ఉన్న మాల్వేర్ కంప్యూటర్లోని సమాచారాన్ని అంతా దొంగలించి, కంప్యూటర్కున్న కెమెరాను మైక్రోఫోనును ఆటోమేటిగ్గా ఆన్ చేసి పూర్తి వీడియో ఆడియోలను హ్యాకర్లకు చేరవేసిందని సమాచారం.
అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని సింగపూర్ ప్రభుత్వం వివరించింది. ఈ యూఎస్బీ ఫ్యాన్స్ను కేవలం గిఫ్ట్ కిందే అందించామని తెలపింది. తమదేశంలో పర్యాటకులకు గిఫ్ట్ కింద ఇచ్చి వారి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. జర్నలిస్టులకు ఇచ్చిన యూఎస్బీ ఫ్యాన్ డివైజ్లు సింగపూర్లోనే తయారయ్యాయని... కిమ్ ట్రంప్ సమావేశం సింగపూర్లో ఉంటుందనే వార్త రాక మునుపే ఇవి తయారయ్యాయని ఆ ప్రభుత్వం వివరించింది.