స్మృతి ఇరానీ బీజేపికి వరమా..! శాపమా.!? పార్టీని చిక్కుల్లో పడేస్తున్న చదువు సంద్యలు...!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపిలో ఆమె చదువు సంద్యల పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. మోడీ ప్రభుత్వానికి స్మృతి ఇరానీ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మోడీ మంత్రివర్గంలో ఓ కీలక శాఖకు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ చదువు విషయంమై తీవ్ర రభస నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు స్మృతిపై ఆధారాలు చూపిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగా ఎన్నికల్లో పోటీకి ఆమెపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది డిమాండ్ చేశారు.
రచ్చ రచ్చ చేస్తున్న స్మృతి చదువు సంద్యలు..! తలలు పట్టుకుంటున్న బీజేపి నేతలు..!!
ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతలకు సంబంధించిన వివరాల ద్వారా బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అడ్డంగా దొరికిపోయింది. ఇది గమనించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది ఆమెపై విరుచుకుపడుతూ మాట్లాడారు. స్మృతి తన విద్యార్హతలపై తప్పుడు పత్రాలను సృష్టించారని, ఈ విషయంలో ఆమె ఎన్నోసార్లు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూవచ్చారని ఆమె పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తున్న స్మృతి ఇరానీ..! ప్రతి ఎన్నికలకు ఇదే తంతు..!!
2014లో ఓ కార్యక్రమం సందర్భంగా తాను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసినట్లు స్మృతి చెప్పారని, అలాంటిది ఆమే.. తాజాగా అమేఠీ ఎన్నికల అఫిడవిట్లో ఇంటర్ మాత్రమే చదివినట్లు వివరాలను పొందుపర్చారన్నారు. ఆమె డిగ్రీ పూర్తిచేయలేదని తాము ఇన్నాళ్లు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన స్మృతి.. తాజా అఫిడవిట్ ద్వారా తాను డిగ్రీ పూర్తిచేయలేదన్న విషయాన్ని స్వయంగా ఆమెనే అంగీకరించినట్లయిందని అన్నారు.
ఏంచేయాలో అర్ధంకాని అంశం..! అసలు స్మృతి చదివిందెంత..?
గతంలో కూడా తన విద్యార్హతలకు సంబంధించి తప్పుడు వివరాలు పేర్కొంటున్నారంటూ స్మృతీ ఇరానీపై చాన్నాళ్లుగా ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని అదును చూసి కాంగ్రెస్ మరోసారి వెలికితీసింది. స్మృతి టీవీ నటిగా వచ్చిన క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ను గుర్తుచేస్తూ ఇప్పుడు స్మృతి సరికొత్త సీరియల్ వస్తోందని చమత్కరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్..! నహీ నహీ అంటున్న సీరియల్ నటి..!!
అది.. క్యూంకీ మంత్రి భీ కభీ గ్యాడ్యుయేట్ థీ అని వ్యంగ్యంగా మాట్లాడుతూ కాంగ్రెస్ విరుచుకుపడింది. తన చదువు విషయంలో తప్పుడు అఫిడవిట్ల ద్వారా ప్రజలను స్మృతి తప్పుదోవ పట్టించారని, ఇందుకు మంత్రిగా ఆమె రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో మోడీ ప్రభుత్వానికి ఇదో పెద్ద తలనొప్పిగా పరిణమించిందని చర్చ జరుగుతోంది. చదువుసంధ్యల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎంతటి అనర్ధమో స్మృతి ఉదంతం స్పష్టం చేస్తోందని కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది.