వచ్చే ఎన్నికల్లో యూపీ బిజెపి ఫేస్, 'ముఖ్య' నేత స్మృతి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నేత స్మృతి ఇరానీ ఆ పార్టీ 'ముఖ్య'నేత లేదా ఆ పార్టీ ఫేస్ కానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ పార్టీ నేత వరుణ్ గాంధీ లేదా ఆదిత్యనాథ్ దాస్ పేర్లు వినిపించాయి. తాజాగా స్మృతి పేరు వినిపిస్తోంది.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) కోరుకుంటున్న, బిజెపి అధిష్టానం పరిశీలిస్తున్న తాజా స్మృతిని యూపీలో బిజెపి 'ముఖ్య' నేతగా ఉపయోగించుకునేందుకు ఆ పార్టీ ఆలోచన చేస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జేఎన్యూ, హెచ్సీయు ఘటన పైన స్మృతి ఇరానీ ధీటుగా స్పందించిన విషయం తెలిసిందే.
బిఎస్పీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఫేస్ చేసేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతి ఇరానీ సరైన నేత అని బిజెపి నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. స్మృతి ఇరానీ 'ముఖ్య' నేతగా, రాష్ట్రంలో బిజెపికి ముఖ్యమైన ఫేస్గా ఆమెనే ఉంటే రాష్ట్ర క్యాడర్ కూడా మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.